తెలంగాణకు పొదుపు సూత్రాలు.. ఆంధ్రాకు పైసలు..

ఇదేనా ప్రధాని నీతి

పాలమూరు-రంగారెడ్డి జాతీయ హోదా పై ఒక్క మాట కూడా మాట్లాడలేదు

మేము అధికారంలోకి వస్తే సాగుయోగ్యమైన ప్రతి గుంట కు నీళ్లు ఇస్తాం

బండి భగీరథ్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలి

-టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

(తెలంగాణ రక్షణ సేన కార్యాలయం, బంజారాహిల్స్)

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ దేశం దాటి వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కోరారు. ప్రధాని మోడీ వచ్చి తెలంగాణకు పొదుపు సూత్రాలు చెప్పి ఆంధ్రాకు మాత్రం పైసలు ఇచ్చారని విమర్శించారు. బంజారా హిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన ప్రధాన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఘాటు విమర్శలు చేశారు.

పారదర్శక విచారణ అవసరం

“కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడి మీద చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి.  అలాంటి సందర్భంలో ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న వేదికను బండి సంజయ్ పంచుకోవటం శోచనీయం. కుటుంబ సభ్యులపై అంత తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు బండి సంజయ్ ఆ మీటింగ్ కు వెళ్లాల్సింది కాదు. దాని కారణంగా పెద్ద వాళ్ల పిల్లలు ఏమీ తప్పుచేసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తారనే భావన ప్రజల్లోకి వెళ్లింది.

ఏ ఆరోపణలు వచ్చినా సరే ముందుగా నిందితులను దేశం దాటించటం బీజేపీకి అలవాటు. వెంటనే బండి భగీరథ్ పై లుకౌట్ నోటీసులు జారీ చేయాలి. అప్పుడు మాత్రమే పారదర్శకంగా విచారణ జరుగుతుందని ప్రజలకు విశ్వాసం వస్తుంది. కొన్ని పార్టీల వాళ్లు ఒక ట్వీట్ వేసి మొత్తం సమస్యను పరిష్కరించినట్లు చేస్తున్నారు. వాళ్లు నేను ఎందుకు స్పందించటం లేదంటూ నానా హంగామా చేస్తున్నారు. కానీ ఒక ఆడపిల్ల అంశం వచ్చినప్పుడు చాలా సంయమనంగా వ్యవహరించాలి. అందులోనూ అమ్మాయి మైనర్ అయినప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. 

ఎందుకంటే ఈ సమాజం మగ పిల్లవాళ్లను క్షమిస్తుంది. కానీ ఆడపిల్లలను మాత్రం క్షమించదు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అత్యుత్సాహం కారణంగా బాధిత అమ్మాయి ఫొటోలు బయటకు వచ్చాయి. దీని కారణంగా ఆ అమ్మాయి జీవితం నష్టపోయే ప్రమాదం ఉంది. వాటిని పోస్ట్ చేసిన ఖాతాలను గుర్తించి వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. మేము ఎప్పుడైనా సరే ఆడపిల్లల పక్షమే. వారికి అండగా ఉంటూనే ఉంటాం. “

జనగణనలో ఓబీసీ కాలం పెట్టాలి

“ప్రధాని మోడీ వచ్చి తెలంగాణకు పొదుపు సూత్రాలు చెప్పారు. ఆంధ్రాకు మాత్రం పైసలు ఇచ్చారు. మహిళా బిల్లు మీద కనీసం ఏమీ మాట్లాడలేదు. మహిళా బిల్లులో ఓబీసీ సబ్ కోటా పెట్టాలి. జనగణనలో ఇళ్ల లెక్క అయిపోయింది. ఇక జనగణన ఉంటుంది. అందుకే కచ్చితంగా వాటిలో ఓబీసీ కాలం పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కులంతో పాటు ఉపకులం, సామాజిక స్థితిగుతులను పరిగణలోకి తీసుకోవాలి. బీసీ రిజర్వేషన్ల కోసం మేము చేసిన రైల్ రైకో కారణంగా ఇవ్వాళ కోర్టుకు వెళ్తున్నాం.” 

జాతీయహోదా కోసం అడగరా..

“పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసం న్యాయబద్ధమైన డిమాండ్ ను మేము చేస్తూనే ఉన్నాం. కృష్ణా నది 300 కిలోమీటర్లు పారుతున్నా సరే మహబూబ్ నగర్ జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిస్థితే ఉన్న అప్పర్ భద్రకు మాత్రం జాతీయ హోదా ఇచ్చారు. మనకు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి మాట్లాడాలి. ప్రధానికి జాతీయ హోదా కోసం లెటర్ రాయాలి. మనకు జాతీయ హోదా కోసం పట్టుపట్టాలి. పుష్కరాల నాటికి పోలవరం పూర్తి కావాలంటూ కేంద్ర ఇరిగేషన్ మంత్రి వద్దకు చంద్రబాబు వెళ్లారు. మీ గురువును చూసైనా రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలి. పోలవరం ప్రాజెక్ట్ వద్దకు ఐదుసార్లు ఆయన వెళ్లారు. పనులు వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. 

కానీ రేవంత్ మాత్రం ఒక్కసారి కూడా పాలమూరు ప్రాజెక్ట్ వద్దకు వెళ్లలేదు. రివ్యూ చేయలేదు. మాట్లాడితే నల్లమల పులిని అని చెప్పుకునే మీ చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతున్నది. పవర్ ప్రాజెక్ట్ అయిన శ్రీశైలంలో కూడా 331 టీఎంసీలు వాడుకునేలా ఆంధ్రావాళ్లు వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. గోదావరిలో 964 టీఎంసీల నీళ్లు వాడుకునే అవకాశం ఉన్నప్పటికీ మనం 220 టీఎంసీలు మాత్రమే వాడుకున్నాం. దీన్ని బట్టే నీళ్ల విషయంలో ఆంధ్రావాళ్లతో పోల్చుకుంటే మనం ఎంత వెనుకబడి ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ప్రాజెక్టు వద్ద మూడు అల్టర్ నేట్ లు పెట్టుకున్నారు. సుంకేశులను బారాజ్ చేసుకున్నారు. చెన్నైకి నీళ్లు అని చెప్పి అక్కడకు వెళ్లే కాలువలను డబుల్ చేసుకున్నారు. శ్రీశైలంలో బురద నీళ్లను కూడా తీసుకునేందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకున్నారు. “

నీటి వినియోగంలో వైఫల్యం

“మనం 1.89 లక్షల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖర్చు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భారీగా ఖర్చు చేస్తున్నది. కానీ గోదావరిలో 25 శాతం, కృష్ణాలో 50 శాతం నీళ్లను కూడా మనం వాడుకోలేదు. అందుకే మేము అధికారంలోకి వచ్చాక కచ్చితంగా నీటి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. వాటర్ కమిషన్ ను ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో నీటి నిర్వహణ అంతా వాటర్ కమిషనే చూసుకుంటుంది. సాగు యోగ్యమైన ప్రతి గుంటకు కూడా నీళ్లు ఇస్తాం. ప్రతి మూడు వేల ఎకరాలకు ఒక లష్కర్ ను నియమిస్తాం. మన రాష్ట్రంలో ఉన్న అనేక చిన్న నదులపై ఎక్కడికక్కడ వందేళ్లు బలంగా ఉండే గేట్లతో కూడిన చెక్ డ్యామ్ లు ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసినట్లు కొట్టుకుపోయే చెక్ డ్యామ్ లను కాకుండా పటిష్టమైన చెక్ డ్యామ్ లను నిర్మిస్తాం. కృష్ణా నదిలో  771 టీఎంసీలను ఆంధ్రావాళ్లు వాడుకున్నారు. మనం వాటా మొత్తం వాడుకునేలా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరముంది. ప్రధాని మోడీ తెలంగాణకు వస్తే బీఆర్ఎస్ కనీసం ఒక్క ప్రశ్న కూడా ఎందుకు అడగలేదు. మన రాష్ట్రాన్నే నీళ్ల కోసం ఏర్పాటు చేసుకున్నాం. దేశంలో 16 రాష్ట్రాల్లో జాతీయ హోదా ప్రాజెక్టులు ఇచ్చినట్లు మనకు కూడా ఇవ్వాలి. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పంపించిన బిల్లులను కేంద్రం ఆమోదించేలా చర్యలు చేపట్టాలి. 

బీసీలకు రాజకీయాలు, విద్య, ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధిస్తాం. ఇందుకోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తిరిగి మా వంతు ప్రయత్నం చేస్తాం. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులు మొదలుపెట్టినప్పుడు మేము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖ రాశాం. 

ఆ లేఖనే రిట్ పిటిషన్ గా వేసి న్యాయపోరాటం కూడా చేస్తాం. కేంద్ర ఇరిగేషన్ మంత్రి సీఆర్ పాటిల్ ను కలిసి తెలంగాణ ప్రాజెక్ట్ ల కోసం మాట్లాడుతాం. “

20 నుంచి జెండాపండుగ

“నీట్ పేపర్ లీక్ అవటం బాధాకరం. పది రూపాయల డైపర్ లీక్ అవటం లేదు. నీట్ పేపర్ మాత్రం లీక్ అవుతోంది. 

ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అయిన మన విద్యార్థులను కేంద్రం బాధపెడుతోంది. ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా పేపర్ లీక్ అవటం బాధాకరం. తెలంగాణలో రాజకీయ శూన్యతను ప్రశ్నించేందుకు తెలంగాణ రక్షణ సేన ఏర్పడింది. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 20 వరకు జెండా పండుగ నిర్వహిస్తాం. నేను కూడా పలు చోట్ల జెండా పండుగ కార్యక్రమానికి హాజరవుతాను. జెండా పండుగ మా పార్టీ నిర్మాణానికి పునాది. జెండా పండుగ నిర్వహణ ద్వారా పదవులు ఇస్తాం.”